మా చిన్నపుడు మేము ఎంతో ఇష్టంగా గా ఆడే ఆట 'దాగుడు మూతలు' .
దాగుడు మూతలు అంటే..మామూలు గా కళ్ళకి గంతలు కట్టుకుని ఆడే ఆట కాదు .
మేము ఆడే ఆట విధానంబెట్టిదనగా ..,మేము 'ముద్దాయిగా 'నిలబెట్టిన ఒకతను ఓ చోట నిలబడి గట్టిగా కళ్ళుమూసుకుని...ఒకటినుండి పది వరకూ అంకెలు లెక్కపెట్టాలన్న మాట ! ఈ లోపు మిగిలిన పిల్లలమంతా ..ఆ మనిషికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాక్కోవాలి .ఆలా దాక్కున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టాలి (అలా జట్టులో చివరి మనిషి వరకూ దొరకాలి ) .
ఒక వేళ ఈ ఆట మద్యలో జట్టు లో ఎవరైనా ఆ 'వెదికే మనిషి' చూడకుండా వెనకనుండి వచ్చి "ఎస్" అని గట్టిగా అరుస్తూ ఆ మనిషిని ని ముట్టుకుంటే మళ్లీ ఆ మొదటి వ్యక్తే మళ్లీ మొదటినుండి ఆట ఆడాలి . అంటే ..చివరికంటా ఎవరికీ చిక్కకుండా అందరిని అవుట్ చెయ్యాలన్న మాట ! అలా చివరికంటా కనిపెట్టగలిగితే ...ఆ ఆటలో మొట్ట మొదట దొరికిన మనిషి 'ముద్దాయి' . అలా దొరికిన ముద్దాయి చేత ఇరవై గుంజీలు తీయించి ,మళ్లీ కొత్త ఆటని మొదలు పెట్టేవాళ్ళం .
ఇలా సాగేది మా ఆట!కొంచెం కష్టమే !ఎక్కువ సార్లు మనం ముద్దాయిగా దొరకుండా ఉండాలంటే ..మనకి ఒక అనుకూల వర్గం ఒకటి ఉండాలి .ఆ వెదికే వాడు మనవాడు అయితే .. పొరపాటున మనం ముందు కనిపించినా 'తూచ్ 'అన్నమాట ! పేరు కి అటే గానీ, ఆ ఆట ఎప్పుడూ కక్ష సాధింపు దిశ గానే జరిగేది . ఏక పక్షం గానే సాగేది . దీనంతటికి మూల 'సూత్రధారి ' మా తో కలిసి ఉంటూ ,మా తోనే గొడవలు పడే 'దుర్గ '.వయసులో మా కంటే కొంచెం చిన్నదే అయినా ,ఆలోచనల్లో మాత్రం ఆపిల్ల దేశముదురు !వాళ్ళ ఇంటి లో నుండి తెచ్చిన నువ్వుపప్పు జీడి లని ,మామిడి తాండ్ర లాంటి చిరు తిళ్ళు చూపించి ..మా జట్టులోని సగం మంది ని తనవైపుకే లాక్కోనేసేది .అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'పెత్తందారీ తనాన్ని' భరించాల్సివచ్చేది.
మొదట ఆట తనే మొదలు పెట్టేది ,ఆనక తనకి గిట్టని పిల్లల్ని తనే ఒక ఆట ఆడించేది . ప్రతీ ఆట లోనూ తనకి ప్రతికూలం గా ఉండే ఆటగాళ్ళని 'ముద్దాయి' లు గా చేసి గుంజీలు తీయించి ,మూడు చెరువుల నీళ్ళు తాగించేది .ఆ రకం గా వాళ్ళ మీద కక్ష తీర్చుకునేది .ఈ ఆటలో ..చిరుతిళ్ళు కి అలవాటు పడ్డవాళ్ళని ,కాస్తో కూస్తో అమాయకుల్ని తనకి అనుకూలం గా వాడు కుంటూ తన మాట లెక్కచేయని వాళ్ళ ఆట కట్టించేది.తనకి నచ్చినట్టు రూల్సు మార్చి దబాయించి మరీ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేది ..అందరూ తను చెప్పినట్టే వినాలనే పంతం దుర్గది! .ఆ ఆధిపత్య ధోరణి ఆమె వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది . తను పెద్దయ్యాక ఓ నాయకురలవుతుందేమో అనుకునేవాన్ని నేను !కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లి తల్లైంది .
చాల రోజుల తరువాత నాకు దుర్గ గుర్తుకొచ్చింది -అది కూడా అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షురాలు సోనియమ్మ దయవల్లే!గత కొద్ది రోజులుగా దేశం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని చూస్తే ..మా దుర్గ కి ఆ అమ్మి కి ఏవో దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది నాకు .
దేశ రాజకీయాలలో ఎక్కడైనా ,ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కి గానీ,వాళ్ళ కుటుంబ వారసత్వానికి గానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడు ఆమె అవలంబిస్తున్న తీరు ఆమెలోని 'ఆధిపత్య ధోరణికి 'అద్దం పడుతుంది.
"ఈ ఆధిపత్య ధోరణి అనేది ఇవాల్టి విషయం కాదని" ..కొద్దో గొప్పో రాజకీయ పరిజ్ఞానం ఉన్న మా పెద నాన్న గారు చెప్పినపుడు నాకు కొంచెం పరిస్థితి అర్ధమైంది . "ఈ గాంధీ కుటుంబీకులకి 'దేశాధికారం' తమ చేతులు దాటిపోవడం ఇష్టం ఉండదట !తమ అధికారాన్ని ,ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా వెనకాడరట . ఆమె 'అత్తమ్మ' ఇందిరమ్మ హయాం లో ఈ 'హవా 'బాగా నడిచిందట !ఆమె అమలుపరిచిన "ఎమర్జన్సీ " ఆమెకి ఓ మాయని మచ్చ గా మిగిలిపోయింది !"
ఇందిరమ్మ గురుంచి మా పెదనాన్న గారు చెప్పిన మాటలేమో గానీ..,సోనియమ్మ విషయం లో మాత్రం ఈ 'హవా' నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తుంది నాకు .మొన్న మన రాష్ట్రం లో జరిగిన' రాజకీయనాటకాన్ని' ఎంతో రసవత్తకరంగా రక్తి కట్టించినపటికి అసలు నిజం అతి సామాన్య మానవుడికి కూడా అర్ధమైపోయింది .సోనియా ఏక పక్ష నిర్ణయం వల్లే రోశయ్యగారు 'పదవీ విరమణ' చెయ్యడం ,కొత్త ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ గారు భాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది . ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ ..ఈ డిల్లీ పెద్దలకి తెలుగు ప్రజానీకం పట్ల ,వారి మనోభావాల పట్ల కొంచెమైనా గౌరవం లేదన్న విషయం మాత్రం తేటతెల్లమవుతుంది .ప్రజలు ఎంతో నమ్మకం తో ఎన్నుకున్న నాయకుల ప్రమేయం కొంచెమైన లేకుండా (మాట్లాడే స్వేచ్చ ఇవ్వకుండా ..అనడం సబబు ) సోనియగారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తెలుగు ప్రజల్ని అవమాన పరచడమే . ఇలాంటి అవమానాల్ని చవిచూడటం వల్లే తారకరామారావు గారు "తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం " అన్న నినాదం తో ఓ పార్టీని స్థాపించి ,విదేశాలలో తెలుగు మహా సభలు పెట్టి తెలుగు జాతి 'ఆత్మ గౌరవాన్ని' అంతర్జాతీయం గా వెలుగెత్తి చాటారు .బిడ్డ ఆకలి ..తల్లి కి తెలుస్తుంది!ఓ తెలుగు వాడి ఆత్మఘోష ఆత్మాభిమానం ఉన్న తెలుగు వాడికే తెలుస్తుంది . అందుకే మన తెలుగు వాళ్ళకి చుర కత్తి లాంటి తెలుగోడే నాయకత్వం వహించాలి -వెన్నెముక లేని కీలుబొమ్మ లు కాదు !
రాష్ట్రాల్లో 'అధికారమే' ఆ పార్టీ ప్రధాన అజెండా గా నడుచుకునే ఈ డిల్లీ నాయకత్వం ,ప్రజల మనోభావాల గురుంచి ..వాళ్ళ కష్ట ,నష్టాల గురుంచి ఆలోచిస్తుంది అనుకోవడం అవివేకం !వాళ్ళకి కావలసిందల్లా ..వాళ్ళు చెప్పినట్టు వినే కీలుబోమ్మల్లాంటి 'స్థానిక నాయకులు 'మాత్రమే !
ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే .. ఇప్పుడున్న నాయకుల్లో కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉన్న రోశయ్య గారు ఆ 'కీలుబొమ్మ' పనిని సక్రమంగా నిర్వర్తించలేకే ..రాజీనామా చేసారా ?!లేక ..అధిష్టానమే తమ ప్రతికూల వర్గీయులకి 'చెక్' పెట్టడానికి ..అదే సామాజిక (ప్రత్యర్ధి సామాజిక వర్గం )వర్గానికి ,ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ని చేసారా అనేది దైవ రహస్యం !ఈయన గారైనా ..తారక రామారావు గారి లా ,రాజశేఖరుడు లా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి వెలుగెత్తి చాటేలా పరిపాలిస్తాడో.. లేకుంటే, 'అమ్మ భజన 'చేస్తూ కీలుబొమ్మాలానే మిగిలిపోతారా అనేది ప్రస్తుత ప్రశ్న?! ఏది ఏమైనా ..ఈ 'కుర్చీలాట' చిన్న పిల్లల 'బొమ్మలాట 'లా అయిపోవడం మన ఆంధ్రరాష్ట్ర దురదృష్టం !సంవత్సరానికి ఒకరు చొప్పున కొత్తగా కుర్చీ ఎక్కిన సి .ఏం లు ,ఆ కుర్చీలో కుదురుకోవడానికే కొన్ని రోజులు గడిచిపోతాయి ..ఇంక రాష్ట్ర అభివృద్ధి గురుంచి ,సంక్షేమం గురుంచి ఆలోచించే సమయం ఎక్కడిది ?!
ఎంతైనా మా 'దుర్గ' నే నయం !తను మా ఆటలో కొన్ని రూల్సుని మార్చేది గానీ ..ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!