21, ఆగస్టు 2010, శనివారం

మా మంచి చందమామ !



నిన్న మా ఆఫీసు లో కొంచెం పని ఉండి,బాగా లేటయిపోయింది.రాత్రి ఒంటి గంట దాటేసింది .
ఆ టైం లో నా రూమ్ కి వెళ్దామంటే..నా చేతి లో బండి(బైకు) లేదు.
"ఈ రాత్రి కి ఇక్కడే పడుకుని..తెల్లార గట్టే లేచి వెళ్ళిపొండి "అని చిన్న సలహా ఇచ్చాడు మా వాచ్ మెన్ .
నాకు ప్లేసు మారితే అంత తొందరగా నిద్ర పట్టదు.
మెల్లగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చాను ..మా ఆఫీసు ఉండేది మూసాపేట లో ..నేను వెళ్ళాల్సింది హౌషింగ్ బోర్డు కాలనీ లోని తొమ్మిదో ఫేజ్ .
ఎంత రాత్రైనా కూకట్ పల్లి జే.ఎన్.టి.యు వరకూ ఎలాగో వెళ్లిపోవచ్చు గానీ,అక్కణ్ణించి నేను ఉండే తొమ్మిదో ఫేజ్ కి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే..,
సెకండు షో సినిమా వదిలేవరకు ఆటో లు ఉంటాయి గానీ ,ఆ తరువాతే... ఆటో లు ఉన్నా వాటికీ రెక్కలు వచ్చేస్తాయి .
ఆ రెక్కల గుర్రాలలో వెళ్ళే ఆర్ధిక స్తోమత అందరికి ఉండదు కదా !
నా లాంటి గుమస్తా గిరి చేసే వాళ్ళకి మరీ కష్టం !
అయినా సరే రూమ్ కి వెళ్ళిపోవాలని గట్టి నిర్ణయం తీసేసుకున్నాను .(నేనెప్పుడు గట్టి నిర్ణయాలే తీసుకుంటాను .కానీ అవి టైం ని బట్టి మెత్తబడి పోతాయి .)

ఎలాగైతేనేం .. ఆ హైవే రోడ్డు మీద ఒక అరగంట పాటు నిలబడి ఎదురు చూస్తే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వస్తున్న సెవెన్ షీటర్ ఆటో ఒకటి దైవం లా వచ్చి ఆగితే దర్జాగా ఎక్కేసి జె.ఎన్.టి.యు దగ్గర దిగిపోయాను .
పోనిలే... చాలా దూరం వచ్చేసాను అనుకుని ,మా రూమ్ వైపు వెళ్ళే హై -టెక్ సిటీ కి వెళ్ళే రోడ్డు లో నిలబడ్డాను .
రోడ్డు కి ఒక పక్కగా ఆటో లు పెట్టుకుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు ఆటో వాళ్ళు "వాడే వస్తాడ్లే"అన్నట్టు నా వైపు కాస్తంత గీర గా చూసే సరికి నాకు వళ్ళు మండిపోయింది .
వీళ్ళే కదా పగలంతా "ఎక్కడికి పోవాలి సార్ "అంటూ మన వెనకాలే పడి తెగ గౌరవించేస్తారు!?
సర్లే ,పోనివ్వమని నాలో అహాన్ని చంపుకుని 'నైంత్ ఫేజ్ కి వస్తారండి "అన్నాను .
"ఎనబై అవుద్ది "నిర్లక్ష్యం గా ఒక చూపు విసిరాడు ఒక అటో వాడు .పగలైతే అయిదు ,రాత్రైతే ఎనబయ్యా ?!
ఇంక వాళ్ళని బ్రతిమాలదలుచుకోలేదు .
."ధైర్యే సాహసే లక్ష్మి "అని మనసు లో అనుకుని ,గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చివదిలి మెల్లగా 'పాదయాత్ర' మొదలు పెట్టాను .

వర్షం లో తడిసిన రోడ్డు ,విద్యుద్దీపాల వెలుగులో నల్ల త్రాచు లా మెరుస్తూ మెలికలు తిరిగి సాగిపోతుంది .నేను అడుగులో అడుగు వేసుకుంటూ ..జాగ్రత్త గా నా గమ్యం వైపు వెళ్తుంటే.. .రైతు బజారు దాటాక ఓ గల్లీ లోంచి నల్ల కుక్క బుల్లెట్ లా దూసుకొచ్చింది .
నేను ఏమాత్రం తొట్రుపాటు పడకుండా అక్కడే కట్టెలా నిలబడిపోయాను .ఇవన్నీఇంతక ముందు మనకి అలవాటే అవడం మూలానా .. కొంచెం ధైర్యం గానే నిలబడ్డాను .కాసేపు మొరిగి దాని దారిన అది వెళ్ళిపోయింది .

ఇక్కడో చిన్న చిట్కా చెబుతాను . కుక్కలు మన వెంట పడినప్పుడు పరుగులు పెట్టకూడదు ,అలాగని తిరగబడ కూడదు .కాసేపు అలాగే నిలబడి దాని కళ్ళల్లో కి తీక్షణం గా చూస్తే చాలు !కొంచెం దూరం మన వెనకాలే మొరుగుతూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది .అదే పిచ్చి కుక్క అయితే మాత్రం ..నేను చెప్పినట్టు చేస్తే మన జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది .
నా చిట్కా ఉపయోగించుకున్న వాళ్ళకి అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం దానికి నేను మాత్రం భాద్యుడిని కాదని ముందే విన్నవించుకుంటున్నాను .

అదిసరే గానీ..ఇక అసలు సంగతి కి వస్తాను. నేను ఎలాగోలా ... ఆ కుక్క బారినుండి తప్పించుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ .మలేషియా టౌన్ షిప్ సర్కిల్ లో కి వచ్చి "హమ్మయ్య "అని ఊపిరి పీల్చుకున్నాను .
అంతే!టక్కుమని కరెంటు పోయింది .ఒక్కసారే ..నా గుండె జారిపోయింది . "ఇదేమి పరీక్ష భగవంతుడా !"అనుకొని కాసేపు ఆ సర్కిల్లోనే నిలబడిపోయాను .
దూరం గా కుక్కల అరుపులు తప్ప ఇంకేమి అలికిడి లేదు.ఆ సర్కిల్ నుండి వెడమ వైపు కి తిరిగి కొంచెం దూరం వెళ్తే మా రూమ్ వస్తుంది.
కానీ రోడ్డుకి ఇరు పక్కలా ఉన్న చెట్లు ,ఆ చీకట్లో జడలు విరబోసుకున్న రాక్షసుల్లా కనిపించేసరికి నా అడుగు ముందుకి పడలేదు.
ఇంతలో మొన్న ఏదో పేపర్లో నేను చదివిన "వంద రూపాయల కోసం హత్య "వార్త గుర్తుకొచ్చి చెమటలు పట్టేసాయి .
ఈ చీకట్లో ఎవరైనా ఎటాక్ చేస్తే ?!.
అప్పుడే నాకు అరుంధతి సినిమా లో అఘోర గుర్తుకొచ్చాడు .వెదవ మనసు ఊరికే ఉండదు కదా !రకరకాల ఆలోచనలు !!
అక్కడ నిలబడలేను ..ముందుకి కదలలేను!!

ఇంతలో ఆ చెట్ల మధ్యలోంచి సన్నని వెలుగు రేఖలు నేల మీద పరుచుకున్నాయి .నేను ఆకాశం వైపు చూసాను .
వెన్నముద్ద లాంటి చందమామ మబ్బు చాటునుండి వస్తూ నవ్వుతూ పలకరించాడు.నాకెందుకో కొంచెం దైర్యం అనిపించింది .
క్రమ క్రమం గా ఆ చుట్టూ పరిసరాలు వెన్నెల వెలుగు తో నిండిపోయాయి .నేను ఇంటికి వెళ్ళే వరకూ మబ్బు చాటుకి వెళ్లోద్దని చందమామని బ్రతిమాలుకుని దైర్యం గా అడుగు ముందుకి వేసాను .
ఆయన్ని చూస్తూనే అడుగులు వేస్తుంటే నాకు అసలు బయమే అనిపించలేదు .తను (చందమామ )నా పక్కనే ఉన్నాడన్న భావన నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది .ఇంత మంచి స్నేహితుడ్ని ఇంత కాలం నేను ఎందుకు మిస్సైపోయాను ?!.నేను రూం కి వెళ్ళిపోయాక ,ఆయనకి థాంక్స్ చెబుదామని ఆకాశం లో కి చూస్తే అయన నవ్వుతూ మబ్బు చాటుకి వెళ్ళిపోతున్నాడు .
నాకు ,మా మరదలు పిల్ల నాతో ఎప్పుడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి "నా మనసు బాలేనపుడు చందమామ తో కబుర్లు చెప్పుకుంటాను "అని .నిజమే ..!అయన తో ఉంటే మనసుకి చాలా హాయిగా ,ధైర్యం గా ఉంటుంది .

రేపు ఆయనకి మేఘ సందేశం పంపాలి ...నా జీవితాంతం నా స్నేహితుడి గా ఉండిపొమ్మని !!

8 కామెంట్‌లు:

lakshman చెప్పారు...

good articlie!

శిశిర చెప్పారు...

Beautiful. చాలా బాగా రాశారు.

అజ్ఞాత చెప్పారు...

Beautiful. చాలా బాగా రాశారు.

శిశిర చెప్పారు...

Beautiful. చాలా బాగా రాశారు.
నా ఐ.డి తో వ్యాఖ్యానిద్దామని ప్రయత్నిస్తుంటే మీ బ్లాగులో వీలవడంలేదు. చాలాసార్లు ప్రయత్నించాల్సివస్తూంది. మీ కామెంట్‌ఫాం ని ఫుల్ పేజ్‌కి మార్చి చూడండి.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

lakshman garu !chalaa thanks andiiii.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శిశిర గారు !నేను టపా రాసిన ప్రతి సారి ,నేను అడగకుండానే :) కామెంట్ రాసి నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు.కామెంట్ పేజి సెట్టింగ్ మార్చాను .తెలియ జెప్పినందుకు చాలా థాంక్స్ అండీ!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగుంది..

శ్రీను .కుడుపూడి చెప్పారు...

Shekar garu..:Thank andii.

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...