23, మే 2010, ఆదివారం

వీధి సినిమా హంగామా !



అవి మా ఊరి మొత్తాని కి అరిగెల వెంకన్నాయుడు గారి లంకంత కొంపలో ,పెద్ద బి పి ఎల్' బ్లాక్ &వైట్ టివి మహా రాజు లా మహా దర్జా గా వెలిగిపోతున్న రోజులు !
ఊరి మొత్తానికి ఒకే ఒక్క టివి కదా ..ఆ మాత్రం దర్జా ఉంటుంది లెండి !
రాత్రి అయ్యేసరికి ఊళ్ళోని జనమంతా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని టివి చూసేదానికి నాయుడు గారి అరుగు మీద తిష్ట వేసేవారు . వారం లో అయిదు రోజులు జనం కాస్తంత పలచగానే ఉన్నా ..మిగిలిన రెండు రోజులు అంటే శుక్రవారం "చిత్రలహరి "అప్పుడు ,ఆదివారం "సినిమా " వచ్చినపుడు మాత్రం వాళ్ళ హాలు మొత్తం రిలీజు సినిమా ధియేటర్ లా కిక్కిరిసిపోయి ,మిగిలిన జనం అరుగు మీద వేల్లాడుతూ ,చివరాఖరు కి రోడ్డు మీద కంటా నిలబడి నేరేడు కాయల్లాంటి కళ్ళని తాటి కాయలంత చేసి ఆత్రం గా చూసేవాళ్ళు .

అలాంటి కరువు రోజుల్లో (సినిమా కరువు లెండి )ఏ దేవి నవ రాత్రుల కో ,వినాయక ఉత్సవాల కో మా ఊళ్ళో తప్పని సరిగా వేసే 'తెర సినిమాల' హంగామా గురుంచి ఇంకేం చెప్పాలి ?!

అవి మా చీముడు ముక్కుల్ని మోచేత్తో తుడుచుకుంటూ ,కృష్ణ ,చిరంజీవులని పిచ్చిగా ఆరాదిస్తూ ..
మా పెద్ద వాళ్ళేమో ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమా రోజుల్ని నెమరు వేసుకుంటూ తాపీగా కాలం వెల్ల దీస్తున్న రోజులు.
అలాంటి రోజుల్లో ..ఉత్సవాల కి నెల రోజుల ముందునుంచే చందాల వసూళ్ళ హడావిడి మొదలయ్యేది .ముఖ్యం గా తెర సినిమాల్ని దృష్టి లో పెట్టుకుని చందాల వసూళ్ళు సాగేవి . ఉత్సవాల్లో మొదటి రెండు రోజులు ,ఏ హరి కథో ,బుర్ర కథా కాలక్షేపం తో నో సాఫీ గానే గడిచిపోయేవి కానీ ,మూడో రోజు నుంచి మాత్రం అసలు గొడవ మొదలయ్యేది .

మా పెద్ద వాళ్ళేమో ,ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమాల్లో ఏదో ఒకటి అని సర్దుకుపోతే ,మా పిల్లకాయలు మాత్రం చిరంజీవి సినిమా ఒకడు ,కృష్ణ సినిమా అని ఇంకొకడు పట్టు బట్టడం తో రెండు గ్రూపులుగా విడిపోయేవాళ్ళం.
అక్కడితో పెద్దవాళ్ళ గ్రూపు తో కలిసి మూడు అయ్యేవి .ఇంక మూడు సినిమాలు తప్పనిసరి అయ్యేవి .
కానీ వసూలయిన చందా డబ్బులు మూడు సినిమాల కి సరిపోకపోవడం తో అభిమాన హీరో సినిమా కోసం ఆయా గ్రూపుల వాళ్ళు మిగిలిన డబ్బుల్ని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది .
పెద్ద వాళ్ళ సంగతి సరేసరి ,మేం పిల్లకాయలం డబ్బులు ఎక్కడ నుంచి తెస్తాం ?

ఒక అవిడియా !ఒక చిన్న రేకు డబ్బాకి చిన్న రంద్రం చేసి రెండు గ్రూపులు కాలవ గట్టు మీద కి వచ్చేవాళ్ళం .
కాలవ ఆవలి పక్కన ఒక గ్రూపు ,ఇవతల పక్కన ఒక గ్రూపు కాపు కాచి దారి లో వచ్చే ,పోయేవాల్లని ఆపి బ్రతిమాలో ,ఒక్కోసారి బలవంతం గానో "దేముడి చందాలు " వసూలు చేసేవాళ్ళం .
నేను మాత్రం చందాలు వసూలు చేసేదానికి వెళ్ళకుండా ఆ రోజంతా సినిమా ప్రచార కార్యక్రమం లో తల మునకలయ్యేవాడిని .
ఎలాగంటే ......మా గుడి లో మైకి సెట్టు లోంచి నిరంతరం గా వస్తున్న"దేవ దేవ ధవళాచల మందిర ...." పాటని మద్య మద్య లో ఆపేసి నా గొంతు ని కాస్తంత గంభీరం గా పెట్టి మైకు లో -
"భక్త మహాశయులారా !విజ్ఞప్తి -ఈ రోజు రాత్రి దేవి నవరాత్రుల సుభ సందర్భం గా మన ఊరి దుర్గమ్మ గుడి దగ్గర సూపర్ స్టార్ కృష్ణ నటించిన గొప్ప బ్రహ్మాండమైన కుటుంబ కథా చిత్రం 'పచ్చని కాపురం 'ప్రదర్శించబడుతుంది .కావున తామంతా విచ్చేసి మాయీ ప్రోగ్రాం ని జయ ప్రదం చెయ్యాలని కోరి ప్రార్దిస్తున్నాం "అంటూ పది నిముషాలకో సారి గొంతు చించుకునే వాణ్ణి .

మైకు సెట్టు లో నా గొంతు విన్న మా అమ్మ తెగ సంబర పడి పోతా ఉంటే,పండక్కి మా ఊరోచ్చిన మా అమ్మమ్మ "విజమ్మా!(మా అమ్మ పేరు విజయ లక్ష్మి ) నీ కొడకు ఎలా బ్రతుకుతాడోనని బాధ పడిపోతావు కదా ...చూడు ..ఎంత బాగా మైకు లో మాట్లాడుతున్నాడో !సినిమా బండి లాక్కోడానికైన పనికి రాడంటావా?"అని వేళాకోలమాడేది .

ఏమైతేనేం ...ఎలాగోలా సాయంత్రాని కి మా వీధి లో 'తెర సినిమా 'పడిపోయేది .సాయంత్రం అయ్యేసరికి మా పిల్లకోతులమంతా ఊళ్ళో మందార చెట్ల మీద పడేవాళ్ళం .ఎవరికి అందిన పూలని వాళ్ళు కోసుకుని వాటితో పాటే కాసిన్ని మందారాకుల్ని కోసి ,చిన్న చిన్న ముక్కల గా చేసి మా అభిమాన హీరో మీద చల్లేందుకు రెడీ గా పెట్టుకుని ఉండేవాళ్ళం .(రామ.. రామ !తప్పుగా అనుకునేరు ..నేను అన్నది తెర మీద హీరో మీద చల్లడానికి ).
రాత్రి కి మా పిల్లకాయలం అంతా తెర ముందు గోనే పట్టాలని పరుచుకుని కూచునేవాళ్ళం .
పెద్ద వాళ్ళ యితే ఏ కుర్చీ నో బల్ల మీదనో ,లేకుంటే అరుగుల మీదనో కూచుని సినిమా చూసేవారు.
ముందు వరసలో కూచున్న మేమంతా తెర మీద కి హీరో గారు వచ్చినప్పుడల్లా ..మేము రెడీ చేసి పెట్టుకున్న పువ్వుల్ని గట్టిగా అరుస్తూ తెర మీద కి విసిరేవాళ్ళం .పెద్దవాళ్ళు మందలించినా వినేవాళ్ళం కాదు .
సినిమా అయ్యేంత వరకూ కింద పడిన పువ్వుల్ని మళ్లీ ఏరుకుంటూ ,అరుచుకుంటూ ,అలసిపోతూ ఏ అర్ధరాత్రప్పుడో ఇళ్ళకు పోయి తృప్తి గా నిద్రపోయేవాళ్ళం .


**పాటల పూ తోట లో మన" వేటూరి పుష్పం " రాలిపోయింది .అయినా ఆ పరిమళం తెలుగు నేల పై నిత్యం గుబాళిస్తూనే ఉంటుంది .ఆ మహాను భావుడి కి కన్నీటి వీడ్కోలు .

15, మే 2010, శనివారం

ఒంటరి తనం



'జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది ".
ఈ పల్లవి నా మనసు లో మెదిలినప్పుడల్లా ..సీతా రామ శాస్త్రి గారు నా మనసులో భావన ని ఎలా కనిపెట్టి ఇంతలా రాయగలిగారబ్బా !అనిపిస్తుంటుంది .
నాకే కాదు ..ఈ పాట వింటున్నపుడు ,ఆంధ్ర దేశం లో తెలుగు తెలిసిన ప్రతి తెలుగు వారు ఇంచుమించుగా ఇలాగే అనుకుంటారనుకుంట.
(ఇక్కడ "ఆంధ్ర దేశం లో తెలుగు తెలిసిన వాళ్ళు " అని ఎందుకు అన్నాను అంటే ..తెలుగు ని ఒక తెగులు గా భావించి తెల్లోడి ఆంగ్ల భాష ని మాత్రమే ఒంట బట్టించుకుంటున్న తెలుగు యువతరం లో చాలా మందికి సరిగా తెలుగు రాదని నా నమ్మకం .అందులో నేను ఒకడి ని .)

సరే ,ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు సంగతి కి వస్తాను.ప్రపంచం లో ఎవరూ లేక ఒంటరి తనం తో అలమటించే అభాగ్యులు చాలా మందే ఉన్నా ...చుట్టూ బంధువు లు ,మిత్రులు ఉండి కూడా
ప్రపంచం లో ప్రతి మనిషి ,ఏదో ఒక క్షణం లో "ఒంటరి "గా ఫీలవ్వని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో !
అలాంటి వాళ్ళ లో నేను ఒకడిని .బహుశా శాస్త్రి గారు కి కూడా ఇలాంటి మానసిక వేదన లో నుంచే ఈ పాట ప్రాణం పోసుకున్నదని నా నమ్మకం .
ఇలాంటి ఒంటరి తనం ,చాలామంది కి అప్పుడప్పుడు అనిపిస్తే ..కొంతమంది కి మాత్రం ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది .దీనికి పూర్తి గా కారణం అయితే చెప్పలేం గానీ ,నాకు తెలిసి మాత్రం రోజు రోజు కి యాంత్రికమైపోతున్న మానవ జీవితా ల్లో ,బలహినమైపోతున్న మానవ బంధాలే ఈ సమస్య కి కారణం గా కనిపిస్తుంది .

ఒక్కొక్కరి జీవితం లో ఒక్కో రకం గా జరిగిన సంఘటన ల ఆధారం గా ఈ 'ఒంటరి తనం 'అలుముకుంటుంది .
కొంతమంది కి తనకి బాగా నమ్మకం అయినవాళ్ళు మోసం చేసినప్పుడు కలిగితే ,ఇంకొంత మంది కి తనకి ఇష్టమైన వాళ్ళు తన ని ఏమాత్రం పట్టించుకోనప్పుడు ఇలాంటి ఒంటరితనం తెలియకుండానే జీవితాల్లో కి ప్రవేశిస్తుంది .
ఈలాంటి మానసిక పరిస్థితుల్లో చాలా మంది చస్తూ బ్రతుకుతుంటే ,కొంత మంది అర్ధం లేని ఆలోచనలు,ఆవేశాలు చుట్టుముట్టి పిచ్చి వాళ్ళ లా ,ఇంకొంత మంది ఉన్మాదుల్లా తయారవుతున్నారు .
ఈ మద్య కాలం లో తరచూ మనం వింటూ ,చూస్తున్న ప్రేమోన్మాదుల వికృత చేష్టల మానసిక పరిస్థితి కి ఈ ఒంటరితనమే ఒక కారణం కావొచ్చు.

నిజానికి మనం మనసు పెడితే ..ఈ ఒంటరి తనం నుండి బయట పడటం ఏమంత పెద్ద పని కాదు.
ఈ కంప్యూటర్ యుగం లో పక్క మనిషి నుంచి నిజమైన ప్రేమ ని ,ఆప్యాయతని ఆశించడం కొంచెం అత్యాశే కానీ ,మనం ప్రేమిస్తే రెట్టింపు ప్రేమని పంచిచ్చే మూగ జీవుల ప్రేమ కి 'కొలమానం' ఏముంది ?
ఆస్వాదించే మనసే ఉండాలి గానీ ప్రకృతి ఒడి లో దొరికే స్వాంతన ఇంకెక్కడ దొరుకుంది ?
ఇలాంటప్పుడు మన కి ఇష్టమైన పనుల లో మనసు పెట్టి ,మనలోని సృజనని బయటకి తీయగలిగితే ..ఈ "ఒంటరి తనం " కూడా ఒంటరిదైపోతుంది కదా !

*మన పెద్ద వాళ్ళు ఆన్నిటి లో కల్లా 'అన్నదానం ' గొప్పదంటారు .కానీ ఈ రోజుల్లో పక్క వాళ్ళ కి కల్మషం లేని ప్రేమ ,ఆప్యాయత పంచి ఇవ్వడం అన్నిటిలో కల్లా గొప్ప దానం అని నా నమ్మకం .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...